ఘట్కేసర్,జూన్27 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్టేరు చెరువు కట్ట పై రోడ్లు భవణాల శాఖ నిధులు 23 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కల్వర్టు, బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ముందుకుసాగుతున్నామన్నారు.
మున్సిపాలిటీలలో పచ్చదనం, హరితహారం, డ్రైనేజీల అభివృద్ధి, వైకుంఠధామాలలో సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా,రోడ్లు, ప్రభుత్వ బడుల ఆధునీకరణ వంటి పనులకు నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధిలో ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ ముందు వరసలో ఉందని మంత్రి వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎం. పావని, వైస్చైర్మన్ మాధవ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.