హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొగ్గుచూపుతోంది. ఈనెల 13న సమ్మె నోటీసు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ సమస్యల పరిషారం కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీసు ఇస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ యా జమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్మికులంతా పెద్దఎత్తున బస్భవన్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్మికులు, నేతల సమక్షంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు. నోటీసులోనే సమ్మె తేదీని ప్రకటించే అవకాశం ఉన్నదని, లేదంటే 14 రోజుల్లో ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగవచ్చని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి తెలిపారు. ఈ సమ్మెతోనైనా ప్రభుత్వం దిగివస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్మికులు ఐక్యతతో ముందుకుసాగాలని కోరారు.