Ration Card | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురు చూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కొత్త కార్డుల జారీపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల్లో ఉలుకు పలుకు లేదు. మొదట్లో క్యాబినెట్ సబ్ కమిటీ, దరఖాస్తుల స్వీకరణ పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట కూడా ఎత్తడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెట్టారు. గద్దెనెక్కిన తర్వాత హామీని బుట్టదాఖలు చేశారని జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో 89.97 లక్షల తెల్లరేషన్కార్డులు, 2.81కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కొత్తరేషన్కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు, కార్డుల్లో మార్పుల కోసం 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షుడిగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సభ్యులుగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. విధివిధానాలు రూపొందిస్తామంటూ కమిటీ పలుసార్లు భేటీ అయింది. కానీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఈ కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు..? కొత్త కార్డులు జారీ చేసేదెప్పుడు అని ప్రజల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. పథకాలపై ఆశలు పెట్టుకున్న జనం నిరాశతో నిట్టూరుస్తున్నారు. మరోవైపు హామీలకు, పథకాలకు రేషన్కార్డుతో ప్రభుత్వం లింక్ పెడుతున్నది. ఎన్నికల సమయంలో ఇవేమీ చెప్పలేదు కదా అని ప్రశ్నిస్తు న్న జనాలు కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడుతున్నారు. పథకాలను ఎగ్గొట్టేందుకే రేషన్కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని, ఆరు గ్యారెంటీల అమలు కూడా ఉత్తముచ్చటే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.