నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడవ రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్ గుర్తించడం గర్వకారణమ’ని అన్నారు. దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని పేర్నొన్నారు.
‘ రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉందని’ వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం రాష్ట్రవ్యాప్తంగా 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను 27,966 బెడ్లకు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటే నేడు 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నకిరేకల్ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 32.00 కోట్లు మంజూరు చేసుకొని పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.