హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ‘గుర్తింపు’ గండాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే మంజూరైన కాలేజీల్లోని సీట్లలో భారీగా కోత పడటంతోపాటు కొత్త కాలేజీల గుర్తింపు ప్రమాదంలో పడింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9 ఏండ్లలోనే 29 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో 17 కళాశాలలు గత రెండేండ్లలోనే ఏర్పాటయ్యాయి. వాటిలో తరగతులు ప్రారంభించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వసతులు కల్పించడంతోపాటు తదుపరి సంవత్సరానికి తగ్గట్టుగా జిల్లా దవాఖానల అప్గ్రెడేషన్కు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మరో 8 కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. 17 కాలేజీల్లో సగటున 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు కొనసాగుతున్నాయి. ఈ కాలేజీల్లో ఈసారి ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందుకోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందం ఫిబ్రవరిలో తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఈసారి సీట్లలో భారీగా కోతపడే ప్రమాదం పొంచి ఉన్నది. ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతుల బోధనకు తగినన్ని పడకలు, బోధన, బోధనేతర సిబ్బందితోపాటు, ఔట్ పేషంట్లకు చికిత్స, ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాలు ఉండాలి. ఈ ప్రమాణాలన్నీ ఉంటేనే కొత్త కాలేజీలకు అనుమతులు లభిస్తాయి. కానీ, వీటిపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు గానీ, డీఎంఈ గానీ ఇప్పటివరకు సమీక్ష చేసిన దాఖలాలే లేవు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అధ్యాపకుల హాజరు, ఇతర వసతులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని డీఎంఈ చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న డీఎంసీ సహా, ఉన్నతాధికారులకు పెద్దగా అనుభవం లేకపోవడంతో ఆ లేఖలకు ఎలా సమాధానం ఇవ్వాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని వైద్యశాఖ వర్గాలు వాపోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో మంత్రి మొదలు అన్ని విభాగాలకు కొత్త హెచ్వోడీలు వచ్చారు. ప్రస్తుత ఇంచార్జి డీఎంఈకి మెడికల్ కాలేజీని గానీ, జిల్లా దవాఖానను గానీ నిర్వహించిన అనుభవం లేదు. డీఎంఈ కార్యాలయంలో అనుభవమున్న టీమ్ లేదు. హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చొంగ్తుది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆమె స్వయంగా వైదురాలే అయినప్పటికీ ఎన్నో ఏండ్ల నుంచి వైద్యశాఖకు దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహకు గతంలో వైద్యశాఖను నిర్వహించిన అనుభవం లేదు. దీంతో వారు ఎన్ఎంసీని ఎంత వరకు ‘మేనేజ్’ చేస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చొరవ చూపితేనే 17 కాలేజీల అనుమతులు కొనసాగుతాయని, లేదంటే సీట్లలో భారీగా కోత పడే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంచార్జి డీఎంఈల స్థానంలో డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేయడంతోపాటు సీనియారిటీ లిస్టులో వ్యవస్థపై పట్టు, అవగాహన ఉన్నవారిని రెగ్యులర్ డీఎంఈగా నియమించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కంటే ముందు నుంచే ఉన్నాయి. వరంగల్లోని ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన కాకతీయ మెడికల్ కాలేజీని ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నది. అంటే.. దాదాపు 6 దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఎంబీబీఎస్ విద్య కోసం రాష్ట్ర విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని నివారించేందుకు నాటి సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు తొమ్మిదేండ్లలోనే 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. 2016-17లో మహబూబ్నగర్, సిద్దిపేట.. 2018-19లో నల్లగొండ, సూర్యాపేట.. 2022-23లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి.. 2023-24లో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. 2024-25లో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకూ గత ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఈ వైద్య కళాశాలలను రేవంత్రెడ్డి ప్రభుత్వం నిలబెట్టాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.