Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్పై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘటనలో ఈ నెల 11న అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నెల 12న టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా దవాఖానాలు, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఘటన జరిగిన సమయంలో హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎగ్జామినర్గా విధులు నిర్వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్పై చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. రోగికి ఎలుక కరిస్తే శానిటేషన్ ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని, వైద్యసిబ్బంది ఎలా బాధ్యులు అవుతారని నిలదీశారు. తాజాగా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు.