హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి కాకుండా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17వేల పైచిలుకు పోస్టుల భర్తీ చురుగ్గా సాగుతున్నది. త్వరలో మరిన్ని ఉద్యోగాలను నింపేందుకు ఆయా నియామక సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి.. దేనికి చదవాలి ? ఎలా చదవాలి ? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే సిలబస్, పరీక్ష విధానంపై సరైన అవగాహన లేనివారే కంగారు పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు.
సిలబస్ను నిశితంగా పరిశీలిస్తే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు 40-60 శాతం కామన్ సిలబస్సేనని అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైన నోటిఫికేషన్లన్నింటిని పరిశీలిస్తే పలు సబ్జెక్టుల సిలబస్ అన్నింటికి ఒకేలా ఉన్నది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, అర్థమెటిక్ రీజనింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకాలజీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నింట్లో కామన్గా ఉంచారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తికాగా, త్వరలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నది.
ఇటీవల గ్రూప్-2, 3, 4 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నాలుగు నోటిఫికేషన్లకు సిలబస్ దాదాపు ఒకేలా ఉండగా, మార్కులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ప్రధానంగా గ్రూప్-1, 2 సిలబస్ దాదాపుగా ఒకేలా ఉన్నది. వీటిలో ఏదో ఒకదానికి సన్నద్ధమైతే సమాంతరంగా గ్రూప్-3,4లకు ప్రిపేర్ అయినట్టే. దీంతోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా ఉంటుంది.
కామన్ సిలబస్ ఇదే
గ్రూప్ -4 సిలబస్
గ్రూప్ -1 మెయిన్స్ సిలబస్
గ్రూప్ -2 సిలబస్
గ్రూప్-2 చదివితే గ్రూప్-3,4 చదవాల్సిన పనిలేదు
నోటిఫికేషన్ల వెల్లువలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఇదే సరైన సమయం. ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్లీ రాదు. అలా అని కంగారుపడొద్దు. దాదాపు అన్నిపోటీ పరీక్షలకు కామన్ సిలబస్సే ఉన్నది. గ్రూప్-2కు చదువుకొంటే.. గ్రూప్ 3,4లకు ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ కామన్ పేపర్. వచ్చిన నోటిఫికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి. పద్ధతి ప్రకారం సబ్జెక్టులు చదవాలి.
-ప్రసన్న హరికృష్ణ, పోటీపరీక్షల విశ్లేషకుడు