హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అనాథలకు జీవితాంతం బాసటగా ఉండే విధానం రూపకల్పన జరగాలని, వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిలా ఉండాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. దేశం గర్వించే విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. శనివారం ఎంసీఆర్హెచ్చార్డీలో క్యాబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనాథల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్తు బాధ్యతలన్నీ ప్రభుత్వమే తీసుకొని వారికి అండగా ఉండే విధాన రూపకల్పన జరగాలని ఉపసంఘం అభిప్రాయపడింది. ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన అనాథ పిల్లలు ఎదిగి, స్థిరపడి తల్లిదండ్రులుగా మారేవరకు, కుటుంబంగా తయారయ్యే వరకు సర్కారు అన్ని రకాల బాధ్యతలు తీసుకొనేలా కొత్త విధానం వచ్చేందుకు ప్రతిపాదిస్తామని ఉపసంఘం పేర్కొన్నది. సమావేశానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ కన్వీనర్ హోదాలో హాజరయ్యారు.