ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.70 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను 70 మంది లబ్ధిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నదని అన్నారు. దళిత బంధు పథకంతో దళిత జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా రూ.లక్ష 116లను ఇస్తున్నారని తెలిపారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. దళిత బంధు పథకానికి రూపకల్పన చేసి దళితులకు ఆ పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో లేరని మంత్రి ఈశ్వర్ అన్నారు.