జగిత్యాల : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ శనివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 70 ఏళ్లకే ఖ్వాంటం పెన్షన్ మంజూరు, గ్రాట్యుటీ రూ.16 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు,పెన్షనర్స్ కు,జర్నలిస్ట్ లకు నగదురహిత వైద్య సౌకర్యాలు కల్పన కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పి.సి.హన్మంత్ రెడ్డి,ఎం.డి.యాకుబ్, కోశాధికారి వి.ప్రకాష్ రావు,ఆర్గనైజింగ్ కార్యదర్శులుఅశోక్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.