జగిత్యాల : పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో గురువారం మంత్రి హరీశ్ రావు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యా, వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు, ప్రభుత్వ దవాఖానాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పర్యటన వివరాలను వెల్లడించారు. మంత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరి నేరుగా ధర్మపురి మండల కేంద్రానికి చేరుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారిని దర్శించు కుంటారని వివరించారు.
అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం 10 పడకల ఐసీయూ కేంద్ర నిర్మాణానికి భూమి పూజ, యాభై పడకల ఆసుపత్రి నిర్మాణపు పనుల పరిశీలన, నూతన డయాలసిస్ కేంద్రం, ఆక్సిజన్ప్లాంట్ ను హరీశ్ రావు ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం ధర్మారం మండలం నందిమేడారం చేరుకొని 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ, బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.