హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ శనగల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా పంట కొనాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా మొత్తం 1.20 లక్షల టన్నుల శనగల కొనుగోలుకు అనుమతిచ్చారు.
ఇందుకు రూ.702.21 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ యాసంగిలో 3.64 లక్షల ఎకరాల్లో రైతులు శనగ సాగు చేయగా, భారీ మొత్తంలో పంట వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ పంట అమ్ముకోవడానికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే నేరుగా కొనాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మార్క్ఫెడ్కు ఆదేశాలు జారీ చేసింది.