హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో ఆధునిక దోభీఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.282 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధోబీఘాట్ల నిర్మాణానికి ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయ్యింది. ధోబీఘాట్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ను మెంబర్ కన్వీనర్గా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్లతో ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధోబీఘాట్ల నిర్మాణానికి ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆయా కమిటీలను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సుమారు రూ.30 కోట్లతో 644 ధోబీఘాట్లను నిర్మించింది. 250 యూనిట్ల మేర ఉచిత విద్యుత్తును అందిస్తూ 2 లక్షల మంది రజకులకు ప్రయోజనం చేకూర్చుతున్నది. తెలంగాణ రజక ఫెడరేషన్ ద్వారా రజక వృత్తికి టెక్ సొబగులను అద్దేందుకు కార్యాచరణ రూపొందించింది. అధునాతన డ్రైక్లీనింగ్ యంత్రాల నిర్వహణపై వృత్తిదారులకు ఒకవైపు శిక్షణ ఇప్పిస్తూనే మరోవైపు ఆధునిక ధోబీఘాట్లను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మిస్తున్నది. బెంగళూరు తరహాలో రాష్ట్రంలోనూ అధునాతన డ్రైక్లీనింగ్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. అందుకోసం పైలట్ ప్రాజెక్టు కింద 8 జిల్లాలతో పాటు, రెండు మున్సిపాలిటీలను ఎంపిక చేసి తెలంగాణ రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్తోపాటు సిద్దిపేట, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణాలను చేపట్టింది. ఒక్కో యూనిట్కు రూ.52.04 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్మించిన ఆధునిక ధోబీఘాట్లు అందుబాటులోకి వచ్చాయి.
రజకవృత్తిదారులను ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే భరోసా లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల మా వారసులు కూడా కులవృత్తిని స్వీకరించడానికి ముందుకొస్తున్నారు. 141 మున్సిపాలిటీల్లో ధోబీఘాట్లను నిర్మించడానికి రూ.282 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయం. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రజక వృత్తిదారులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
– కొండూరు సత్యనారాయణ, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు