హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా దాదాపు 16 నెలల క్రితం స్కూళ్లు, కాలేజీల్లో ఆగిపోయిన ప్రత్యక్ష బోధన బుధవారం నుంచి పునఃప్రారంభం అవుతున్నది. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయరాదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్లైన్లో నిర్వహించాలా? ప్రత్యక్షంగానా? అనేది ఆయా విద్యాసంస్థలు, విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు పేర్కొన్నది. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచుతున్నట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధానంలోనైనా తరగతులకు హాజరుకావొచ్చు. ఇంటర్, డిగ్రీ సహా అన్ని రకాల కాలేజీల్లో మాత్రం ప్రత్యక్ష తరగతులే నిర్వహిస్తారు. 40 వేల పైచిలుకు స్కూళ్లలోని 60 లక్షల మంది విద్యార్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ తరగతులకు హాజరుకానున్నారు. 1,800 జూనియర్ కాలేజీల్లోని 9 లక్షల మంది విద్యార్థులు, 955 డిగ్రీ కాలేజీల్లోని 4.5 లక్షల మంది, వృత్తి విద్యాకోర్సుల్లోని ఐదు లక్షల మంది విద్యార్థులు కేవలం ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం మార్గదర్శకాలు విడుదలచేశారు.
కోర్టు సూచన మేరకు..
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను నిలిపేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, న్యాయమూర్తి జస్టిస్ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఆ వెంటనే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రత్యక్ష బోధనపై గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేశారు. అంతకుముందు పిల్ విచారణ సందర్భంగా తరగతులకు కచ్చితంగా హాజరుకావాలని విద్యార్థులను బలవంతం చేయరాదని హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేకూడదని పేర్కొంది. గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మరో నాలుగు వారాలపాటు ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై వారంలోగా మార్గదర్శకాలు జారీచేసి మీడియాలో వాటిని విసృ్తతంగా ప్రచారం చేయాలని సూచించింది. పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ నాలుగోతేదీకి వాయిదా వేసింది. యూనివర్సిటీ హాస్టళ్లు, కాలేజీ హాస్టళ్లు బుధవారం నుంచే తెరుచుకోనున్నాయి. వీటిపై కోర్టులో విచారణ జరగకపోవడంతో నేటి నుంచే ప్రారంభించనున్నారు. విద్యార్థుల హాజరు నేపథ్యంలో విద్యాసంస్థల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేపట్టనున్నారు.
కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులే
యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. విద్యార్థులు, సిబ్బంది మాస్క్లు ధరించడం తప్పనిసరి. తరగతిగదులు, ప్రయోగశాలలను శానిటైజ్ చేయాలి. భౌతికదూరం పాటించాలి.
-ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి కదా?
పిల్పై విచారణ సందర్భంగా పిటిషనర్కు ధర్మాసనం పలు సూటి ప్రశ్నలు సంధించింది. ‘ఎకడో ఒకచోట మళ్లీ తరగతులు ప్రారంభం కావాలి కదా? సమస్యను హైదరాబాద్ కోణంలో మాత్రమే చూడకూడదు. సిటీల్లో ఆన్లైన్, హైస్పీడ్ ఇంటర్నెట్, కంప్యూటర్లు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో లేవు కదా? అకడి పిల్లలకు వీటికంటే మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. ఎంతోమంది మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. అది లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను కూడా పనుల్లోకి పంపాల్సిన దుస్థితి వస్తున్నది. చాలా ప్రైవేటు విద్యాసంస్థలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉన్నది. రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తే భౌతికదూరం పాటించటం సాధ్యమేమో కానీ, టీచర్లు రెట్టింపు సంఖ్యలో అవసరం కదా? ఇలా చేస్తే ఎప్పటికి తరగతులు పూర్తవుతాయి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధనతో లాభనష్టాలు రెండూ ఉన్నాయని వ్యాఖ్యానించింది.