హైదరాబాద్ : అగ్నిప్రమాదాలను ( Fire Accidents ) నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అమీర్ పేట ( Ameerpeta ) లోని మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రమాదం వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు, కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా అగ్నిమాపక శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలు అందుబాటులో కి తేవాలని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అధికారులను ఆయన అభినందించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్, ప్రవీణ్ రెడ్డి, సుమిత్ సింగ్, కట్టా బలరాం, సాయి, ప్రదీప్ గౌడ్, తదితరులు ఉన్నారు.