Telangana | హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): ‘పనిచేసి పదిమందిని సాకితే.. ఉపాయంతో ఊరందర్నీ సాకిండట’ తెలివిమంతుడిని ఉద్దేశించి నానుడిలో ఉన్న సామెత ఇది. కాంగ్రెస్ పాలన, కేసీఆర్ పాలనా తీరుకు ఇది చక్కగా సరిపోతుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పంటలకు సాగునీరు అందిస్తే.. సాకులు చెప్పి కాళేశ్వరం నీటిని బంద్ చేసింది కాంగ్రెస్.బీఆర్ఎస్ హయాం లో నిరుడు యాసంగి సీజన్లో ఎస్సారెస్పీలో నీళ్లు తక్కువ కావడంతో వరంగల్లో కాకతీయ కెనాల్ పరిధిలోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
విషయం కేసీఆర్ దృష్టికి రాగానే సింగూరు డ్యాంలో నీళ్లుంటే అక్కడి నుంచి ఎస్సారెస్పీకి, అక్కడి నుంచి వరంగల్కు నీళ్లు అందించి పంటలు కాపాడారు. సాగునీటి కోసం ఒక ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతుంటే, మరో ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లను ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపి యాసంగి పంటలకు సాగు నీళ్లు అందించి కరువు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వలేక చేతులు ఎత్తేసింది. మేడిగడ్డ కుంగిందని, వానలు లేవని ఇలా సాకులు చెబుతూ సాగునీటిని విడుదల చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండుతున్నాయి.
ఎండుతున్న పంటలు
కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిపివేయడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి. ఫలితంగా నిరుడు 7.34 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కొతరతో సుమారు 20 లక్షల ఎకరాల్లో వరిపంట ఎండిపోయినట్లు సమాచారం. మరో ఐదు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఎండిపోయినట్టు తెలిసింది. రాజకీయాలను పక్కనపెట్టి ప్రాజెక్టును రిపేర్ చేస్తే ఇప్పుడు ఈ సాగు నీళ్ల కొరత ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ బోర్ల చప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగు నెలల పాలన రైతులకు మళ్లీ మునుపటి రోజులను గుర్తు చేస్తున్నది. గ్రామాల్లో మళ్లీ బోర్ల చప్పుడు మొదలైంది. బావుల వద్ద క్రేన్లు దర్శనిమిస్తున్నాయి. కండ్లముందే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయిస్తున్నారు. కొత్త బావులు తవ్విస్తున్నారు. బావుల్లో పూడిక తీయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 500 కొత్త బోర్లు పడుతున్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలో ఈ నెలలో దాదాపు 500 బోర్లు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు ఒక్కో బోరుకు రూ. 60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
నీటి నిల్వపై ధ్యాస ఏదీ?
మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు అందించే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ను, కేసీఆర్ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం దానిని పక్కనపెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరంలో కొంతమేరకు నీటిని నిల్వచేసి ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ విచారణ పేరుతో ప్రభుత్వం ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్న విమర్శలున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టులోని ప్రాణహిత నుంచి నిన్నటి వరకు రోజూ సుమారు 5 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోయింది. ప్రస్తుత నీటి కొరతకు ఇదికూడా ఒక కారణమని చెప్తున్నారు.
ట్యాంకర్ నీటితో పంటసాగు
సాగునీరు లేకపోవడంతో పంటలు రక్షించుకునేందుకు రైతులు ట్యాంకర్ నీటిని ఉపయోగించుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుని పొలాలకు పారించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్ సహా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.
జీవనాడిగా కాళేశ్వరం
రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎక్కువగా బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి భూగర్భ జలాలు పెరిగేలా చేస్తేగానీ సాగునీళ్లు అందని పరిస్థితి. దీనిని గుర్తించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా మార్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సుమారు 20-30 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్మానేరు, అప్పర్మానేరు, ఎల్ఎండీ, కాకతీయ కెనాల్కు నీళ్లు విడుదల చేసేవారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు నీళ్లు విడుదల చేసి నింపేవారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలమైన నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సుమారు కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. గత అక్టోబర్లో కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దీన్ని సాకుగా చూపిన కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పడావు పెట్టేసింది. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపడం, ఎత్తిపోయడం మొత్తానికే నిలిపివేయడంతో కాళేశ్వరం నుంచి నీళ్లు వెళ్లాల్సిన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి.
కష్టాలు కొని తెచ్చుకున్నాం
పంటలకు సాగునీరు అందక ఓవైపు, కరెంటు కోతలు మరోవైపు, పంటలకు మద్దతు ధర దక్కక ఇంకోవైపు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని ఊహించలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండో, ఎలా చేసిండో తెలియదు కానీ, తమకు మాత్రం కష్టం రానివ్వలేదని గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే తమను కష్టాలు చుట్టుముట్టాయని వాపోతున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడం వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వరంలో నీళ్లు నిల్వచేసి ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపితే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేదని కాదని రైతులు, వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.