సిద్దిపేట : వ్యవసాయ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చoదలాపూర్ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలసి తుంపర సేద్య పరికరాలు, ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..దేశంలోని గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయన్నారు.
కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక్క యూనిట్ కు రూ.20 రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగా నిరంతర కరెంటు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రైతులు ఆరుతడి, వాణిజ్య పంటలు పండించి లాభాలు పొందాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని రైతులకు 4 వేల తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నదాతలు సహకరించాలన్నారు.
ఆయిల్ ఫామ్ పంటలు పండించడంతో పాటు అంతర పంటలు వేసి లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షలన్నర రూపాయల వరకు రైతులు ఆర్జిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామానికి చెందిన నర్సింలు స్ఫూర్తితో ఎక్కువ మంది రైతులు కూడా సెరి కల్చర్, ఆయిల్ ఫామ్, కమర్షియల్ పంటలు పండించాలని కోరారు.
అనంతరం పెద్దకోడూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.