హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్, బీజేపీ వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విప్ ఎంఎస్ ప్రభాకర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు తలా రూ.1 లక్ష ఇవ్వాలని బండి పేర్కొనటాన్ని తప్పుబట్టారు. గతంలో యూపీఎస్సీ పరీక్షలు అనేకం లీకయ్యాయని, అప్పుడు కేంద్రమేమైనా కోటి రూపాయలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అయిన ప్రతి బీజేపీ పాలిత రాష్ట్రంలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఇలానే ఇచ్చారా? అని నిలదీశారు.
లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వమే గుర్తించిందని, బాధ్యత గల పదవిలో ఉన్న బండి ఉద్యోగార్థులను రెచ్చగొట్టేలా వ్యవహరించటం దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుకు లీగల్గా స్పందించాలనే కనీస ఇంగితం కూడా లేదని దుయ్యబట్టారు. కేటీఆర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. బండి సంజయ్ తాఖత్ ఏమిటో? జ్ఞానం ఏమిటో? కరీంనగర్ ప్రజలపై బండికి ఉన్న అవగాహన ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం దోహదం చేసిందా? ద్రోహం చేసిందా? అనే విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బండికి సవాల్ విసిరారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మైండ్బ్లాంక్ అయిందని ప్రభు త్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు పేర్కొన్నారు. పేప ర్ లీకేజీపై బండి, రేవంత్ తీరు కుక తోక వంకర అనే చందంగా ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి నిరుద్యోగులపై ప్రేమ లేదని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. యువత విపక్ష నేతల మాటలను పట్టించుకోవటం లేదని, యువతకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉన్నదని అన్నారు.