అక్కన్నపేట, జూన్ 16 : సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ వెంటనే ప్రారంభించాలని కోరుతూ అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట రైతులు గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మెట్ట ప్రాంతానికి శాశ్వతంగా కరువును దూరం చేసి, గోదావరి జలాలతో మూడు కాలాల పాటు పంటలు పండేలా కృషి చేస్తున్నారన్నారు.
గోదావరి నీళ్లతో హుస్నాబాద్ ప్రాంతమంతా పచ్చగా మారుతుందన్నారు. భూ నిర్వాసితులను తప్పుదారి పట్టిస్తూ ప్రతిపక్షాలు ప్రాజెక్ట్ ట్రయల్ రన్ను అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులకు మేలుచేసే సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజలు, రైతుల పక్షాన ఆలోచన చేసి ప్రాజెక్ట్ ట్రయల్ రన్కు సహకరించాలని రైతులు కోరారు. భూ నిర్వాసితులు త్యాగం చరిత్రలో ఎప్పటికి మరిచిపోలేనిదన్నారు. రైతుదీక్షలో గుబ్బడి, గొల్లకుంట గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.