హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : సొమ్ముకొకరిది.. సోకొకరిది అన్న సామెత సీఎం రేవంత్రెడ్డికి నూటికి నూరుపాళ్లు సరిపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ సర్కార్ తొమ్మిదిన్నరేండ్లలో లక్షా 40వేల ఉద్యోగాలిచ్చి, మరో 30వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దశలో నియామక పత్రాలు అందజేసి ఇది తమ ప్రభుత్వ ఘనతేనని రేవంత్రెడ్డి పోజులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నదని, ప్రజలేమీ అమాయకులుకారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మూడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు నిర్వహించినవి, ఫలితాలు ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య ఎంత? అని ప్రశ్నించారు. కనీసం ఒక్క నోటిఫిషన్ కూడా జారీ చేయకుండా కేసీఆర్ సర్కార్ చేపట్టిన ఉద్యోగ నియామకాలను తామే భర్తీ చేసినట్టు చెప్పుకోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సరూర్నగర్ సాక్షిగా యువత డిక్లరేషన్లో నిరుద్యోగ భృతి రూ. 4000 ఇస్తామని చెప్పి తీరా మాట మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తామంటే కుదరదని పేర్కొన్నారు.