వనపర్తి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థికాభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం వనపర్తి జిల్లాలో వినూత్నంగా అమలవుతున్నది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కృషి తో జిల్లాలోని పలు గ్రామాల్లో వందశాతం దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోని ఐదు గ్రామాల్లో వంద శాతం కుటుంబాలకు దళితబంధు యూనిట్లను మంజూరుచేయగా, లబ్ధిదారులు సంబురపడుతున్నారు. నిన్నామొన్నటి వరకు కూలీనాలి చేసుకొనే తమకు దారిచూపిన సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నారు.
అన్ని కుటుంబాలకు..
దళితబంధు అమలు కోసం మంత్రి నిరంజన్రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకొన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చొరవ చూపారు. ఈ నేపథ్యం లో ఖిల్లాఘణపురం మండలంలోని మల్కిమియాన్పల్లిలో మొత్తం 25 కుటుంబాలకు యూనిట్లను అందజేశారు. ఇదే మండలంలోని గట్టుకాడిపల్లిలోనూ మొత్తం 10 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వనపర్తి మండలం కర్ణమయ్య కుంటతండాలోని తొమ్మిది దళిత కుటుంబాలకు, నాచహళ్లి గ్రామంలోని 11 కుటుంబాలకు వివిధ రకాల యూనిట్లను మంజూరు చేశారు. పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో కూడా మొత్తం 20 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేశారు. లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు, టెంట్హౌస్లు , ల్యాండ్ సర్వే యూనిట్లు, సూపర్బజార్లు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, సూపర్ బజార్లు, షూమార్టులు తదితర యూనిట్లను అందజేశారు.
ట్రాక్టర్ యజమానినయ్యా..
నా పేరు కాటేపాగు బీచుపల్లి. మాది పెబ్బేరు మండలంలోని పెంచికలపాడు గ్రామం. గతంలో హైదరాబాద్లో మేస్త్రీ పని చేసేవాడిని. రోజు పని దొరకక కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. కేసీఆర్ సార్ పుణ్యమా అని దళితబంధులో నాకు ట్రాక్టర్ వచ్చింది. ఇప్పుడు ట్రాక్టర్తో కుటుంబానికి సరిపడా అదాయం వస్తున్నది. గతంలో ఏ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు. వెయ్యి రూపాయలు చూడటం గగనమయ్యేది. గ్రామంలోనే పని చేసుకొని సంతోషంగా ఉంటున్నా. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డిసార్కు రుణపడి ఉంటాం.
– కాటేపాగు బీచుపల్లి, ట్రాక్టర్ యజమాని