హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను తక్షణమే అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలు సోమవారమే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్) ఎన్ బలరామ్ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసి, జూన్ నెల జీతాలు నేడు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. గత పది వేజ్ బోర్డు జీతాల అమలుతో పోలిస్తే ఇదో సంచలన నిర్ణయం. గతంలో వేజ్ బోర్డు నిర్ణయాలు జరిగిన తర్వాత జీతాల చెల్లింపునకు నెలల తరబడి సమయం పట్టేది. అది కూడాకోల్ ఇండియాలో అమలైన తర్వాతే సింగరేణిలో అమలయ్యేది. కానీ, ఈ సారి మాత్రం సింగరేణి ఒక అడుగు ముందుకేసింది. కోల్ ఇండియా కంటే ముందుగానే కొత్త వేజ్ బోర్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో 41 వేల మందికి ప్రయోజనం కలుగనుండగా, సింగరేణికి ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనున్నది.
కొత్త వేజ్ బోర్డు వేతనాలు ఇలా..
డైలీ రేటెడ్ కేటగిరీ-1లో బేసిక్ గతంలో రోజుకు రూ.1011.27 ఇచ్చేవారు. ప్రస్తుతం అది రోజుకు రూ.1502.66 పెరిగింది. అదేవిధంగా మంత్లీ రేటెడ్ ఏ1 గ్రేడ్ బేసిక్ నెలకు రూ.98,485.79 ఉండగా, ప్రస్తుతం నెలకు రూ.1,46,341.67 అయ్యింది. కొత్త బేసిక్ ప్రకారం డైలీ రేటెడ్ క్యాటగిరీ-1 ఉద్యోగి స్థూలంగా నెలకు రూ.59,386.57 జీతంగా పొందనున్నారు. మంత్లీ రేటెడ్ అండర్ గ్రౌండ్ ఏ1 గ్రేడ్లోని గరిష్ఠ బేసిక్ రూ.1,46,341.67 ఉండగా, స్థూలంగా నెలకు రూ.2,16,618.74 జీతంగా పొందనున్నారు. కోల్ ఇండియా కంటే ముందుగానే సింగరేణిలో కొత్త వేజ్ బోర్డు అమలు చేస్తున్న సీఎండీ శ్రీధర్కు జనరల్ మేనేజర్ (పర్సనల్ ఐఆర్ అండ్ పీఎం) బీ హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన జీతాల అమలులో ఏవైనా కొన్ని స్వల్ప తేడాలుంటే, వాటిని రాబోయే పేరోల్ ద్వారా సరిచేస్తామని పేర్కొన్నారు. పెరిగిన జీతాల గణన, చెల్లింపు అమలులో సమన్వయం చేసి సహకరించిన డైరెక్టర్లు, జీఎంలు, అధికారులు, సిబ్బందికి సింగరేణి సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలియజేశారు.