హైదరాబాద్ : గ్రామాల అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడే 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ఆలస్యంగా జరగడంతో రెండేళ్లపాటు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ.. పలు కారణాలవల్ల గత రెండేళ్లుగా నిలిచిపోయాయి.
బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, దానిపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం ఈ జాప్యానికి ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాతే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఎన్నికలు లేని పరిస్థితిలో నిధుల విడుదల సాధ్యం కాదన్న కేంద్ర వైఖరి కారణంగా గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
అయితే కేంద్ర పెద్దలతో రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క పలు దఫాలు చర్చలు జరిపి నిధుల కోసం విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అయినప్పటికీ ఎన్నికలు పూర్తికాకపోవడం కారణంగా నిధుల విడుదల సాధ్యపడలేదు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉండటంతో సీతక్క ప్రక్రియను వేగవంతం చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి సుమారు రూ.3000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. అందులో తొలి విడతగా రూ.259.36 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన నిధులను కూడా దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది.
తొలి విడత నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. అదే సమయంలో మిగిలిన పెండింగ్ నిధులను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. గ్రామ స్వరాజ్యం బలోపేతం కావాలంటే గ్రామ పంచాయతీలకు సమయానికి నిధులు అందడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.