హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థికమంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటుచేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది’ అని హరీశ్రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లందరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. అధికారిక సమాచారం మేరకు రాష్ట్రంలో 6.6 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా, మొత్తంగా 16 లక్షల మంది కుటుంబసభ్యులకు ఈ పథకంతో లబ్ధిచేకూరనుంది.
ఉద్యోగసంఘాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రతి నెల ఉద్యోగుల మూల వేతనం నుంచి ఒకశాతాన్ని ఈహెచ్ఎస్కు చందాగా సమకూరుస్తారు. ప్రభుత్వం కూడా తనవంతుగా ఒకశాతాన్ని జమచేస్తుంది. ఈ మొత్తాన్ని కార్పస్ ఫండ్గా జమచేస్తారు. ఆ కార్పస్ఫండ్ నుంచే ఉద్యోగుల, వారి కుటుంబసభ్యుల వైద్యఖర్చులను చెల్లిస్తారు. ఇలా ఉద్యోగుల వాటాతో పటిష్ఠమైన ఆరోగ్య పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని.. ఈ పథకం అమలుకు మొత్తంగా రూ. 700-800 కోట్లు అవసరమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ పథకం పట్ల ఉద్యోగ, ఉపాధాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఇదివరకు ఆరోగ్యశ్రీ తరహాలో ఉద్యోగులకు ఈహెచ్ఎస్ను అమలుచేశారు. అప్పట్లో ఇన్స్యూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పథకాన్ని అమలుచేయగా, తాజాగా ఎంప్లాయిస్ హెల్త్కేర్ ట్రస్ట్ ద్వారానే ఈ పథకాన్ని అమలుచేసే అవకాశాలున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
తమిళనాడు తరహాలో..
తమిళనాడులో ఉద్యోగుల ఆరోగ్య, వైద్య సేవల కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టు తరహా ఏర్పాటున్నది. పలువురు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తమిళనాడు వెళ్లి దీనిపై అధ్యయనం చేసి వచ్చారు. తెలంగాణాలో ప్రస్తుతం అమలవుతున్న ఈహెచ్ఎస్లో ఖర్చుల విషయంలో కొన్ని పరిమితులున్నాయి. కాగా కొత్తగా ఏర్పాటు చేయబోయే పథకాన్ని ఉద్యోగుల వాటా తక్కువ.. లబ్ధి ఎక్కువ పొందేలా రూపకల్పన చేయనున్నారు. అలాగే, క్యాన్సర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సహా ఖరీదైన వైద్యాన్ని కూడా ఈ పథకంలో చేర్చనున్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ టీఎన్జీవో నేతలు సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ప్రభుత్వానికి, మంత్రులకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్కుమార్, కేఆర్ రాజ్కుమార్, కురాడి శ్రీనివాస్, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
కేంద్రం అనేక రకాలుగా ఆర్థిక దిగ్బంధనం చేసినా, ఎలాంటి సహకారం అందించకున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడి నుంచి గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకొని రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం హర్షణీయం. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రజామోదం పొం
దిన బడ్జెట్ ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, దూరదృష్టితో రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతున్నది. అందువల్లే నిరుడి కన్నా ప్రస్తుత బడ్జెట్లో పెరుగుదల సాధ్యమైంది.
–బీ వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
వేతనాలు పెంచి..
ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరింది
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ఉద్యోగులు, టీచ ర్లు, పెన్షనర్ల దశాబ్దాల కల. ఈ స్కీం అమలుపై మంత్రి హరీశ్రావు ఇటీవలే అన్ని సంఘాలతో చర్చలు జరిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యంకానిది, నేడు సీఎం కేసీఆర్కు సాధ్యమైంది. అప్పటి ముగ్గురు సీఎంలతో ఉద్యోగులు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. కానీ వారు ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈహెచ్ఎస్ అమలుతో కష్టాలు దూరమయ్యాయి.
– మామిళ్ల రాజేందర్, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు
ఉద్యోగుల కోరిక నెరవేర్చడం శుభసూచకం
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కోరుకున్నట్టుగా నూతన హెల్త్స్కీంను అమలుచేయడం సంతోషదాయకం. పీఆర్సీ కమిషన్ సూచించినట్టు కొత్త పథకాన్ని అమలుచేయడం శుభసూచకం. ఉద్యోగుల మూల వేతనంతో పాటు ప్రభుత్వం సైతం కొంత ప్రీమియం చెల్లించడం స్వాగతించదగిన పరిణామం. ఈ ఆరోగ్య పథకం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
– పింగళి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ఈహెచ్ఎస్ సంజీవని వంటిది
ఉద్యోగులకు ఆశాజనకమైన పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం ఉద్యోగులకు మేలు కలిగించే ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం. ఈ పథకంతో ఎంప్లాయ్ ఫ్రెం డ్లీ ప్రభుత్వమని మరోసారి చాటుకున్నది. ఈ పథకం ఉద్యోగులందరికి సంజీవ ని వంటిది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించే పథకమిది.
–హన్మంత్నాయక్, గ్రూప్ -1 అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నగదు రహిత చికిత్స హర్షణీయం
ఇంతకాలంగా మెడికల్ బిల్లులను రీయింబర్స్ చేయడం ఉద్యోగులకు భారంగా తయారయ్యింది. మొదట ఉద్యోగులు బిల్లులు చెల్లించడం ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవడం జరుగుతున్నది. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వందశాతం బిల్లులు క్లెయిమ్ కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఈహెచ్ఎస్ను అమలు చేయడంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నగదు రహిత చికిత్సను అమలుచేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు.
– వీ మమత, టీజీవో అధ్యక్షురాలు
నాన్ గెజిటెడ్ ఉద్యోగులకే అధిక లాభం
నాన్ గెజిటెడ్ ఉద్యోగులం గణనీయంగా ఉన్నాం. అధికారులతో పోల్చితే మా వేతనాలు తక్కువ. కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారినపడితే టెన్షన్ పడేది మేమే. ఈహెచ్ఎస్తో నాన్ గెజిటెడ్ ఉ ద్యోగులకే అధిక లాభం జరుగుతుంది. తక్కువ వేతనాలుండి దవాఖాన బిల్లులు భరించలేని ఎంతోమంది నాలుగో తరగతి ఉద్యోగులకు తీవ్ర ఉపశమనం కలుగుతుంది.
– ముజీబ్ హుస్సేని, టీఎన్జీవో అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా
2.58 లక్షల పెన్షనర్లకు న్యాయం
రాష్ట్రంలో 2.58 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారే ఎక్కువగా షుగర్, బీపీతోపాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. బిల్లులను చెల్లించలేనిస్థితిలో ఉన్నారు. ఈ పథకంతో పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు దవాఖానల ఖర్చులు చెల్లించే సమస్య తొలగిపోనుంది.
– లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్
ఉద్యోగ సంఘాలతో కమిటీ వేయాలి
2014లోనే నగదు రహిత చికిత్స కోసం ఉచిత హెల్త్కార్డులిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటళ్లలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ పలు కారణాలతో ఇది పూర్తిస్థాయిలో అమలుకాలేదు. తాజాగా ఈహెచ్ఎస్ను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభసూచకం. నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించి.. ఈ స్కీమ్ అమలుకు హైపవర్ కమిటీని వేయాలి. ఈ కమిటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షించి సమన్వయం చేయాలి.
– సదానంద్గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఇది మేలు చేసే పథకం
గతంలో ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులను దవాఖానలు ఆమోదించడం లేదు. దీంతో ఆరోగ్య భద్రత లేక ఉద్యోగులు ప్రైవేట్ కంపెనీలకు ప్రీమియం చెల్లించి హెల్త్కార్డులు తీసుకుంటున్నారు. నూతన ఈహెచ్ఎస్తో ప్రైవేట్ హెల్త్కార్డులకు ముగింపు పలకడం శుభపరిణామం. ఉద్యోగులు ఒకశాతం, ప్రభుత్వం మరోశాతం ప్రీమియం కలిపి కార్పస్ ఫండ్తో ఉచిత ఆరోగ్యసేవలందించడాన్ని
స్వాగతిస్తున్నాం.
– రాములు, తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
మా విన్నపాన్ని మన్నించినందుకు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ ప్రత్యేక హెల్త్ స్కీమ్ను ప్రకటించడం సంతోషకరం. ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతం కంట్రిబ్యూషన్తో ఈహెచ్ఎస్ అమలు చేయాలని ప్రభుత్వానికి మొదటగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మా విన్నపాన్ని మన్నించి, అమలు చేసినందుకు కృత జ్ఞతలు. రెవెన్యూ ఉద్యోగులకు మంచి ప్రయోజనం కలుగుతుంది.
– వంగ రవీందర్రెడ్డి, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు