హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో నిర్వహించిన ‘బలిజల సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. తెలంగాణ మినీ ఇండియాగా ఖ్యాతి పొందిందని, అన్ని ప్రాంతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. సుస్థిర పాలన, చక్కటి శాంతిభద్రతల వల్లే అనేక బహుళజాతి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు.
రాష్ట్రంలో మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవమిస్తున్నారని, అనేక మందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కర్ణాటకలో అధిక సంఖ్యలో ఉన్న బలిజలను బీసీ జాబితా నుంచి తొలగించడం విచారకరమని అన్నారు. బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలన్న న్యాయమైన డిమాండ్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దుతు ఇస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు నేతలు ఆకుల రజిత్, సుధీర్కుమార్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్, కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం నేతలు జయరాం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.