ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్
సీఈవోతో మంత్రి కే తారకరామారావు
ప్రగతిభవన్లో ఇరువురి భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా వ్యాపార, వాణిజ్య వర్గాల సంబంధాల బలోపేతంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా లీసా సింగ్ మాట్లాడుతూ.. దేశంలో వివిధ రంగాల్లో అత్యంత వేగంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని అన్నారు.
రాష్ట్రంలో ఐటీ, లైఫ్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్లో పర్యటిస్తుందని తెలిపారు. తాము ఇప్పటికే తెలంగాణలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని చెప్పిన లీసా సింగ్.. వీ-హబ్ తమ భాగస్వామి అని వెల్లడించారు. పెట్టుబడులను అందిపుచ్చుకొనేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని ఆమెకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిశీల తెలంగాణ పరిస్థితులను ఆస్ట్రేలియా పారిశ్రామిక వర్గాలకు వివరించాలని సూచించారు.