హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ టికెట్ల కేటాయింపులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు (Gone Prakash rao) ఫైర్ అయ్యారు. పారాచుట్ నేతలకు స్థానం కల్పించారని విమర్శించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న వారికి అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్కి ఆయన లేఖ రాశారు. సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు, బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అందులో కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని సూచించారు. అనేక సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ సీటు ఇస్తున్నదని విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గెలవలేక పోయారని, కాంగ్రెస్ తరఫున ఎలా విజయం సాధిస్తారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.