హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు భగ్గుమన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిందని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రతీ వార్డులో గురువారం బీజేపీ దిష్టిబొమ్మలకు గొల్లకురుమలు శవయాత్ర నిర్వహించారు. ప్రధాని మోదీ, రాజగోపాల్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం దోనిపాముల, బోండాగిపర్తి, తాస్కానిగూడెం, శిర్దేపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో యాదవులు మోదీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి తగిన సమాధానం చెబుతామని గొల్లకురుమలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చండూరు మండలంలోని నేర్మట గ్రామంలో కురుమ యాదవ సంఘం తరఫున భారీ ఎత్తున కురుమ యాదవులు ర్యాలీగా బీజేపీ రాష్ట్ర పార్టీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, అనంతరం దహనం చేసి నిరసనను తెలిపారు. గురువారం మర్రిగూడ చౌరస్తాలో టీఆర్ఎస్, గొల్ల కురుమ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దామరభీమనపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మను గొల్ల, కురుమలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్కు ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన అయోధ్యయాదవ్ హెచ్చరించారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో యాదవ సంఘం నేతలు బీజేపీ దిష్టిబొమ్మతో ర్యాలీ తీసి, చౌరస్తాలో దహనం చేశారు.