మేడ్చల్ మల్కాజిగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగులను నిర్మించడానికి సన్నహాలు చేస్తుంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగుల్లో నిల్వ చేస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో నూతన గిడ్డంగి (గోడౌన్) పనులకు గురువారం మంత్రి జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు.
రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. రైతాంగానికి రైతుబంధు కింద కోట్లాది రూపాయలను బ్యాంక్లో జమచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
నేడు తెలంగాణలో రైతులు సంతోషంగా జీవిస్తున్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.