హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు అయిన గోదాదేవి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేపట్టారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదాదేవి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది. ఏటా ధనుర్మాసంలో 30 రోజులపాటు సాగే ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. కన్నుల పండువగా నిర్వహించిన గోదాదేవి కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.