హైదరాబాద్: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 23,200 క్యూసెకులు ఇన్ఫ్లో వచ్చి గోదావరిలో కలుస్తున్నది. వాటిని లింక్- 1, 2లలో 18 మోటర్లను ప్రారంభించి, నిరంతరాయంగా నీటిని తరలిస్తున్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయగ్రి పంప్ హౌస్ల ద్వారా వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ వైపు కాళేశ్వరం జలాలు పరుగులుపెడుతున్నాయి. దీంతో రాంపూర్ పంప్హౌస్ నుంచి రాజేశ్వర్రావు పేట పంప్ హౌస్కు నీళ్లు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుకోనుంది. 34 తూముల ద్వారా చెరువులను నింపేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
లక్ష్మీ బరాజ్లోకి 23,200 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 96.80 మీట్లకు నీటిమట్టం చేరుకున్నది. లక్ష్మీ బరాజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 100 మీటర్లు కాగా, గరిష్ట నీటిమట్టం 16.17 టీఎంసీలు. పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి పంప్ హౌస్లోని 3 మోటార్ల ద్వారా 6 పంపులతో అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్లోకి 8,793 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 96.80 మీటర్లు ఉన్నది.