భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి వరద ప్రవాహం 52.20 అడుగుల వద్ద కొనసాగింది. ప్రస్తుతం 13.80 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో గోదావరి 52.50 అడుగుల వద్ద వరద ప్రవహించడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో చర్ల – భద్రాచలం, బూర్గంపాడు – కొత్తగూడెం మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
గోదావరికి మళ్లీ వరద పోటెత్తడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా తగ్గించింది.