భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు జలకళ
హైదరాబాద్/నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 12: నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళను సంతరించుకొన్నాయి. దీంతో అధికారులు వచ్చిన వరదను మొత్తం దిగువకు వదులుతున్నారు. అత్యధికంగా ఎల్లంపల్లి నుంచి 5.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం, ఎస్సారెస్పీకి వరద ఒక్కరోజులోనే ఐదారు రెట్లు పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని సద్వినియోగం చేసుకోవడంపై నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతుల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండటంతో ఈ వానకాలంలో సాగునీటికి ఢోకా లేదని అధికారులు చెప్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తటంతో దిగువకు వెళ్తున్న గోదావరి ప్రవాహం
ములుగు జిల్లాలో భారీ వర్షాలకు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్న లక్నవరం చెరువు
లక్ష్మీబరాజ్ వద్ద 81 గేట్లు ఎత్తివేత
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలోని శ్రీపాద ప్రాజెక్టు వద్ద 43 గేట్లు, మంథని మండలంలోని పార్వతీ బరాజ్ వద్ద 58 గేట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సరస్వతీ బరాజ్ వద్ద 60 గేట్లు, మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్ వద్ద 81 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతీ బరాజ్ నుంచి 4,30,110ల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లక్ష్మీబరాజ్ నుంచి 9,01,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మోయతుమ్మెద ద్వారా 2,551 క్యూసెక్కుల నీరు ఎల్ఎండీలోకి చేరుతున్నది. కూడెల్లి, పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు నిండి మత్తడి దుంకుతున్నది.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం వద్ద సోమవారం ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం స్పల్పంగా శాంతించింది. మంగళవారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న గోదావరి వరద నీటిమట్టం.. సాయంత్రం 6 గంటలకు 51.8 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి, రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని పలు వీధుల్లోకి గోదావరి వరద నీరు చేరింది. ప్రధానంగా భద్రాచలంలోని రామాలయం సమీపంలోని వీధులు రెండోరోజూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తున్నది. తాలిపేరు వద్ద 24 గేట్లు పూర్తిగా ఎత్తి 1,81,669 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు.