వందేండ్లలో జూలై నెలలో ఇదే భారీ వరద.. నిండుకుండల్లా ప్రాజెక్టులు
కాళేశ్వరంలో 34 సెం.మీ. వాన
24 గంటల్లో ఇదే అత్యధికం
ఐదు రోజులుగా కుండపోత
రాష్ట్రంపై అల్పపీడనం కేంద్రీకృతం
చురుకుగా రుతుపవనాల కదలిక
మరో మూడురోజులు భారీ వాన
21 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
మొగులుకు చిల్లు పడ్డట్టు ఐదురోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తుండగా.. పలుచోట్ల పాతాళగంగ పైకి ఎగదన్నుతున్నది. గోదావరి నదికి వరద పోటెత్తడంతో బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గత 100 ఏండ్లలో జూలై నెలలో గోదావరికి ఇంత భారీ వరద రావడం ఇదే తొలిసారి. కృష్ణాబేసిన్లో సైతం వరద మొదలవుతున్నది. తుంగభద్ర నుంచి భారీగా నీరు విడుదలవుతున్నది.
తెరిపి లేని వర్షాలతో హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో వరదనీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వందల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచి పోవడంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో అత్యధికంగా కాళేశ్వరం వద్ద 34 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ఇది పదేండ్ల వరుస రికార్డును బ్రేక్ చేసిందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం నుంచే భారీ వర్షాలు మొదలయ్యాయని, ఇది అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారి ఒకేచోట కేం ద్రీకృతం కావడం, నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతుండటంతో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి ఒడి శా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగిందని చె ప్పారు.
రుతుపవన ద్రోణి తీవ్ర అల్పపీడనం మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని వివరించారు. వీటి ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉన్నదని తెలిపారు. దీంతో మరో మూడురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిశాయి.
41 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లపైన వర్షం
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్ మంగళవారం 822 ప్రాంతాల్లో ఎంత వర్షం పడిందో లెక్కించింది. మంగళవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్ భూపాల్పల్లి, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లోని 41 ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. 92 ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. 148 ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. 211 ప్రాంతాల్లో 1నుంచి 2 సెంటీ మీటర్ల మధ్య, 330 ప్రాంతాల్లో 1 సెంటీమీటర్లోపు వర్షం కురిసినట్టు వెల్లడించింది.
వరద సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ
భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకొన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక శాఖ సన్నద్ధమైంది. వరద ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో 18 రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచినట్టు రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తెలిపారు. హైదరాబాద్తో పాటు ముఖ్య పట్టణాల్లో ఇండ్లలోకి చేరే వరద నీటిని ఎత్తి పోసేందుకు అవసరమైన డీవాటరింగ్ పోర్టబుల్ పంప్లను జపాన్ నుంచి తెప్పించినట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కలిపి మొత్తం 11 పోర్టబుల్ పంపులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇవి నిమిషానికి 1,400 లీటర్ల నీటిని ఎత్తిపోస్తాయని పేర్కొన్నారు.
సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా స్థానికంగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులతో సమన్వయం చేసుకొంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వరదలపై సమీక్ష నిర్వహించారు. నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై మా మడ మండలం న్యూ సాంగ్వి వద్ద జాతీయ రహదారి అప్రోచ్ రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం పట్టణంలో మంగళవారం పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. భద్రాచలంలోని ముంపునకు గురైన కొత్తకాలనీ వాసులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.