హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరగ్గా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎస్డీ దేశ్పాండే, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్లపై తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్ మాట్లాడారు. చనకా, కొరాటా, చౌటుపల్లి హన్మంతురెడ్డి డీపీఆర్లపై చర్చించినట్లు పేర్కొన్నారు.
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలపై డీపీఆర్పై చర్చించామని, ఏపీకి చెందిన వెంకటనగరం పంప్హౌస్ డీపీఆర్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు డీపీఆర్పై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులున్నాయని, ఇవాళ్టి సమావేశంలో ఏపీ నుంచి అభ్యరంతరం పెట్టారని పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబీ చైర్మన్ తిరస్కరించారని, గెజిట్ నోటిఫికేషన్ను అభ్యయనం చేసి నివేదిక ఇస్తారన్నారు. గోదావరి నీటిని ఏపీ పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లిస్తోందని, గోదావరి జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలన్నారు. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై సైతం చర్చించినట్లు వివరించారు.