హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అందరి బంధువని, సబ్బండ వర్ణాలకు సాయంగా ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించినట్టు త్వరలోనే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకం అమలవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, మడమ తిప్పరని అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు అమలు చేస్తామని చేసిన ప్రకటనపై కృతజ్ఞతలు తెలపడానికి పాలకుర్తి నియోజకవర్గం నుంచి గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు మంత్రి ఎర్రబెల్లి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల కోసం ఆరేండ్ల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లును కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్రం కాదన్నా, మన రాష్ట్రంలో గిరిజనుల కోసం 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే దళిత బంధులాగే, గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు మనమంతా కృతజ్ఞతతో, అండగా ఉండాలని చెప్పారు.
20 వేల టన్నుల ఎండుమిర్చి సేకరణ లక్ష్యం
రాష్ర్టంలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యల (ఎఫ్పీవో) ద్వారా 20 వేల టన్నుల తేజ రకం ఎండుమిర్చిని సేకరించి ప్రైవేటు కంపెనీలకు విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దీని ద్వారా రైతులకు, ఎఫ్పీవోలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట హరితప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్స్ కంపెనీ ఎండీ జాన్ నేచుపాదం తేజ ఎండుమిర్చి మారెటింగ్ ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎఫ్పీవోలు ఈ ఏడాది రూ.200 కోట్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గతేడాది రెండు నెలల్లోనే ఎండుమిర్చి ద్వారా ఖమ్మం జిల్లాలో రూ.40 కోట్ల వ్యాపారం చేసి రూ.92 లక్షలు ఎఫ్పీవో ఆర్జించిందని వివరించారు. ఈ సీజన్ నుంచి ఆరు జిల్లాల్లో తేజ రకం ఎండుమిర్చి సేకరించి ఎఫ్పీవోలు రూ.10 కోట్ల లాభాలు ఆర్జించేలా ప్రణాళిక రూపొందించినట్టు పేర్కొన్నారు. సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రం ఉత్తమ ఎఫ్పీవోల అవార్డు ఇచ్చిందని గుర్తుచేశారు.