కవాడిగూడ, మే 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. శనివారం ఇందిరాపార్కు వద్ద కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల అధ్యక్షతన జరిగిన ధర్నాలో సైంటిస్ట్ ఫర్ పీపుల్ డాక్టర్ కే బాబూరావు, తెలంగాణ పీపుల్స్ జేఏసీ నాయకుడు కన్నెగంటి రవి, ఎమ్మెల్సీ కోదండరాం, దళిత బహుజనఫ్రంట్ నాయకుడు శంకర్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, తెలంగాణ ఉమన్ అండ్ ట్రాన్స్జెండర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ సజయ, పలు పార్టీల నాయకులు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసైన్డ్ భూములకు శాశ్వత పట్టా హక్కు కల్పించాలని అన్నారు.
ఆన్లైన్లో తొలగించిన రైతుల పేర్లను మళ్లీ ఎక్కించి రిజిస్ట్రేషన్ హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన అసైన్డ్ రైతులకు అదనపు పరిహారంపై ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కూలీలకు పూర్తి పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే ఫార్మాసిటీ, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను గౌరవించి కర్ణాటకలో చేసినట్టుగా ఇక్కడ కూడా భూసేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలు పాల్గొన్నారు.