నాగార్జున సాగర్ : బుద్ధుని జయంతి వేడుకలు నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కన్నులపండుగగా జరిగాయి. టిబెట్, మైసూర్తో పాటు, వివిధ ప్రాంతల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బుద్ధుని పాదుకలవద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
2015లో అసంపూర్తిగా ఉన్న బుద్ధవనాన్ని చూసి, ముఖ్యమంత్రి కేసీఆర్ దండిగా నిధులు విడుదల చేసి, అత్యంత సుందరంగా, ముగ్దమనోహరంగా బుద్ధవనాన్ని తీర్చి దిద్దారని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాషకు అనుగుణంగా బుద్ధవనం నేడు అంతర్జాతీయ స్థాయి బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లుతున్నదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా బుద్ధవనాన్ని సందర్శించాలన్నారు.
ఇక బౌద్ధ మత గురువు సంఘాబాల మాట్లాడుతూ.. బుద్ధుని జీవిత విశేషాలను, జీవిత సత్యాలను కండ్లకు కట్టినట్లు వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనాన్ని అందంగా తీర్చి దిద్దిందన్నారు. ప్రపంచ బౌద్ధులకు బుద్ధవనం పవిత్ర భూమిగా మారిందని తెలిపారు.
ఈ వేడుకల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ ఉండ్రు, బుద్ధవనం ఆర్కిటెక్ట్ శ్యాం సుందర్, ప్రొఫెసర్ సంతోష్ రావు, ప్రముఖ జర్నలిస్టు కె.రాంచంద్రమూర్తి, బుద్ధవనం ఎస్ఈ క్రాంతి బాబు, బుద్ధవనం కన్సల్టెంట్స్ ఈమని శివనాగిరెడ్డి, ఓఎస్డీ సుదాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.