హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులతో జరిగిన సమావేశం తీర్మానాలను సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్గౌడ్తో కలిసి తిరుమల వెళ్లినందుకు ఎన్నికల సంఘ అధికారులు తనను సస్పెండ్ చేయ డం అన్యాయమంటూ పర్యాటక సంస్థ ఎండీ మనోహర్రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. టీటీడీ దర్శన కోటా టికెట్ల సంఖ్యను పెంచాలని కోరేందుకు అధికారిక విధుల్లో భాగంగానే మనోహర్రావు తిరుమలకు వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటూ.. సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్య కార్యదర్శి వాదనలను విన్న తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది.