చారకొండ, మే 31: తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. ఎస్సై వీరబాబు తెలిపిన కథనం ప్రకారం.. చారకొండకు చెందిన జెల్ల రామస్వామి(50), కల్లు గీసుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉప్పునుంతల మండలంలో బంధువులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో తాటికల్లు గీయడానికి పొలం దగ్గరికి వెళ్లాడు. రాత్రి 9 గంటలు దాటినా రామస్వామి ఇంటికి రాకపోవడంతో భార్య శ్యామలమ్మ, కొడుకు సాయి స్థానికులతో కలిసి తాటివనంలోకి వెళ్లి చూడగా కల్లుగీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలాన్ని ఎస్సై వీరబాబు పరీశీలించారు. ఆదివారం ఉదయం మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.