హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బాలికలకు ఉన్నత విద్యనందించడంలో బీజేపీ పాలిత రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అధమ స్థానంలో ఉన్నది. డబుల్ ఇంజిన్ రాష్ర్టాలుగా చెప్పుకొనే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, గుజరాత్లో బాలురతో పోలిస్తే బాలికలు తక్కువ సంఖ్యలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) నివేదికలో వెల్లడయ్యింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 18 నుంచి 23 ఏండ్ల మధ్య వారిలో జాతీయంగా అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. అన్ని క్యాటగిరీల్లో 100 మంది అబ్బాయిలకు 105 మంది అమ్మాయిలు ఉండగా, ఎస్సీలలో 107 మంది ఉన్నారు. గుజరాత్లో అన్ని క్యాటగిరీల్లో 100 మంది అబ్బాయిలకు 87 మంది, ఎస్సీలలో 89 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నత విద్యలో నమోదయ్యారు. డబుల్ ఇంజిన్ రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్రలు జాతీయ సగటు కన్నా వెనుకబడ్డాయి. ఈ విభాగంలో తెలంగాణ అత్యుత్తమ స్థానంలో ఉన్నది. అన్ని క్యాటగిరీల వారీగా చూసినప్పుడు 100 మంది అబ్బాయిలకు 109 మంది అమ్మాయిలు ఉన్నత విద్యను పొందుతుండగా, ఎస్సీలలో 124 మంది నమోదయ్యారు. అనేక రాష్ర్టాల్లో అమ్మాయిలు ఇంటర్, ప్లస్ టూ విద్య పూర్తికాగానే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ఉన్నత చదువులను అందుకోలేకపోతున్నారు.