తాడ్వాయి, జనవరి 6: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ప్రధాన గేటు లోపలికి వచ్చే దారిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తల్లులకు సమర్పించే బెల్లాన్ని మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసే బెల్టుపై వేయగానే అది నేరుగా తల్లుల గద్దెల వద్దకు వెళ్లి లోపల పడిపోతుంది. ప్రతిసారీ జాతర సమయంలో గద్దెలు మొత్తం బెల్లంతో నిండిపోవడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది.
గద్దెల వద్ద బెల్లం కరిగిపోయి పానకంగా మారి భక్తుల కాళ్లకు అంటుకుని మేడారం పరిసరాల్లో మొత్తం వ్యాపిస్తున్నది. దీంతో ఈగల బెడద పెరగడంతోపాటు, గద్దెలను శుభ్రం చేయడం ఇబ్బందిగా మారుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు కన్వేయర్ బెల్టును సుమారు రూ.80 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. మొదట సమ్మక్క గద్దెపై బెల్లాన్ని బెల్టు ద్వారా చేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇది విజయవంతమైతే వచ్చే జాతరకు సారలమ్మ గద్దె వద్దకు బెల్లం చేర్చేందుకు, గద్దెలపై పోగైన బెల్లాన్ని బయటికి తరలించేందుకు కన్వేయర్ బెల్టులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఓ సంస్థకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు సాధ్యాసాధ్యాలపై దేవాదాయశాఖ అధికారులతో చర్చించారు. అనంతరం మేడారం పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠికి వివరించారు.