GHMC Mayor | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై జీహెచ్ఎంసీ( GHMC ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి( Mayor Vijayalaxmi ) నిప్పులు చెరిగారు. కవితను కించపరిచేలా మాట్లాడిన బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Governor Tamilisai ) అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అందుకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి( Ambedkar Statue ) జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే గొంగిడి సునీత కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించాలని మేయర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం అని తేల్చిచెప్పారు. కవితకే కాదు.. మొత్తం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మేయర్ డిమాండ్ చేశారు.
గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ.. మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు రాజ్భవన్ వద్దకు చేరుకున్నారు. కానీ వారికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బారికేడ్ల వద్దనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాజ్భవన్ ఎదుట కొద్దిసేపు మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు పలవురు కార్పొరేటర్లు బైఠాయించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ బండి.. డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఉదయం నుంచి గవర్నర్ సమయం ఇవ్వట్లేదని మహిళా నేతలు పేర్కొన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వినతిపత్రాలను రాజ్భవన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లకు కార్పొరేటర్లు అంటించారు. అనంతరం రాజ్భవన్ నుంచి ఖైరతాబాద్ వైపు ర్యాలీగా తరలివెళ్లారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ మహిళా నేతలు వినతిపత్రం సమర్పించి తమ నిరసనను వ్యక్తం చేశారు.