జీహెచ్ఎంసీలోని పేదలకు ఉచిత వైద్య పరీక్షలు
నేడు మరో 10 రేడియాలజీ హబ్స్ ప్రారంభం
ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్లు
15 నెలల్లోనే పేదలకు రూ.4.2 కోట్లు ఆదా
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుడు జనవరిలో 8 హబ్స్ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభిస్తున్నది. ఒకట్రెండు వారాల్లో మరో రెండు సిద్ధమవుతాయి. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీలు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. 12 మినీ హబ్స్తో ప్రజల ఆరోగ్యం, పైసలను కాపాడవచ్చు.
రూ.4 కోట్లకు పైగా ఆదా..
వైద్యారోగ్య శాఖ గత జనవరిలో 8 మినీ హబ్స్ ప్రారంభించింది. బారస్, జంగంపేట, అంబర్పేట, పురానాపూల్, పనిపురా, శ్రీరాంనగర్, సీతాఫల్మండి, లాలాపేటలో ఇవి సేవలు అందిస్తున్నాయి. వీటిలో ఎక్స్రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నారు. 129 బస్తీ దవాఖాన / పీహెచ్సీ / సీహెచ్సీల నుంచి పరీక్షల కోసం రోగులు ఈ హబ్స్కు వస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి 15 నెలల్లో ఈ 8 మినీ హబ్స్లో 54,100 రోగులు రిజిస్టర్ కాగా, 60,281 పరీక్షలు చేశారు. వీటి ద్వారా పట్టణ పేదలకు రూ.4.26 కోట్లు ఆదా అయ్యాయి.