KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే ‘గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్’ (జీటీఐపీఏ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కోరుతూ శాస్త్ర సాంకేతిక రంగ విధానం కోసం పనిచేస్తున్న ప్రపంచ నిపుణులతో కూడిన ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్’ (ఐటీఐఎఫ్) ఆహ్వానించింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్కు రాసిన లేఖలో ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ కోరారు.
జీటీఐపీఏ వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణల ద్వారా పౌరులకు ప్రయోజనాలు అందించేందుకు కృషిచేస్తున్న స్వతంత్ర నిపుణులతో కూడిన సంస్థ. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య, ఆవిష్కరణ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ సదస్సు లక్ష్యం. ప్రాంతీయ ఆవిష్కరణల్లో పోటీతత్వం, జీవశాస్ర్తాల ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన విధానాలు, డీకార్బనైజేషన్ను సులభతరం చేసే డిజిటల్ సాంకేతికతలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సుస్థిరత సాధించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణ విధాన సమస్యలపై చర్చించేందుకు ప్రపంచంలోని ప్రముఖ విషయ నిపుణులు, వ్యాపార, ప్రభుత్వ, విద్య, విధాన రూపకల్పనకు సంబంధించిన ప్రపంచ ప్రముఖులను ఈ సదస్సుకు ఆహ్వానించారు.