సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 25: ‘సిరిసిల్ల స్మార్ట్ సిటీని తలపిస్తున్నది.. పదేండ్లలోనే అద్భుత ప్రగతి సాధించింది.. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ చొరవతోనే ఇదంతా సాధ్యమైంది.’ అంటూ జర్మనీకి చెందిన జీఎస్ఈ సంస్థ చైర్మన్ థామస్ ప్రశంసల వర్షం కురిపించారు. స్టడీ టూర్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన జీఎస్ఈ బృందానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ బుధవారం తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ సంస్థ స్టడీ టూర్లో భాగంగా రెండేండ్లకోసారి సిరిసిల్లలో పర్యటిస్తున్నామని తెలిపారు. పట్టణంలో తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి జరగడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం బతుకమ్మ, దసరా పండుగల విశిష్టతను జీఎస్ఈ బృందానికి జిందం కళ వివరించారు. మంత్రి కేటీఆర్ తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీవై నగర్ చర్చి ఫాదర్ శ్యాంకల్వల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, దూస శ్రీకాంత్ పాల్గొన్నారు.