హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ అమలు చేస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే నానుడి మరోసారి నిరూపితమైంది. తెలంగాణ మున్సిపల్శాఖ అమలు చేస్తున్న ఇండ్లకు జియో ట్యాగింగ్ విధానం బాగున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రశంసించింది. ఈ విధానాన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కింద ఇతర రాష్ర్టాల్లోనూ ప్రవేశపెట్టాలని సూచించింది. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అన్ని రాష్ర్టాల మున్సిపల్శాఖ అధికారులతో ఆన్లైన్లో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, నగరాల్లో భువన్యాప్ ద్వారా అమలుచేస్తున్న జియో ట్యాగింగ్ విధానం గురించి సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ వివరించారు. వివిధ రాష్ర్టాల అధికారులు తమ సందేహాల గురించి సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే తెలంగాణ నుంచి సాంకేతిక సహకారం పొందాలని కేంద్ర అధికారులు సూచించారు.
దేశంలోనే తొలిసారిగా..
ఇండ్లకు జియో ట్యాగింగ్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నది. దీని కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఇంటి కొలతలను సేకరించి పన్ను నిర్ధారిస్తున్నారు. పట్టణాల్లోని బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వెళ్లి యాప్లో ఇంటి నంబర్, ఇంటి కొలతలతోపాటు ఆ ఇంటి ఫొటోను అప్లోడ్ చేస్తున్నారు. గతంలో నమోదైన వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్చి చూస్తారు. అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణాలు చేపట్టారా? అదనపు అంతస్తులు, గదులు నిర్మించారా? తదితర విషయాలను పరిశీలిస్తారు. అనుమతులు లేకుండా ఎవరైనా అదనపు నిర్మాణాలు చేపడితే ఆ విషయం వెంటనే తెలిసిపోతుంది. దానికి అనుగుణంగా పన్నులు వసూలు చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17.50 లక్షల ఇండ్లకు సంబంధించిన వివరాలు, ఫొటోలను నమోదు చేశారు. ఇందులో దాదాపు 88% ఇండ్లకు జియో ట్యాగింగ్ పూర్తయ్యింది. జియోట్యాగింగ్ విధానం ద్వారా పన్నులు పెంచకుండానే తెలంగాణ మున్సిపల్శాఖకు రూ.110 కోట్ల ఆదనపు ఆదాయం వచ్చింది.