Genome Valley | లారస్ ల్యాబ్స్.. 2005లో ఊపిరి పోసుకున్నది. సాధారణ స్టార్టప్గా జీనోమ్వ్యాలీలో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో కేవలం వెయ్యి చదరపు అడుగుల ల్యాబ్తో ఫార్మా పరిశోధనలు మొదలుపెట్టిన లారస్ ల్యాబ్స్.. ఇప్పుడు రూ.17వేల కోట్ల విలువైన ఫార్మా కంపెనీ. 6 వేలమందికి ఆ సంస్థ ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తున్నది. జీనోమ్వ్యాలీ విజయ ప్రస్థానానికి లారస్ ఓ మచ్చుతునక.
స్టార్టప్లను గ్లోబల్ కంపెనీలుగా మార్చింది జీనోమ్ వ్యాలీ. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీ ప్రపంచ ఫార్మా, బయోటెక్ పరిశోధనలకు దిక్సూచిగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ఇది ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదిక. ఇది విజయ ప్రతీక. విశ్వవీధిలో ఎగురుతున్న తెలంగాణ పతాక.
జీనోమ్ వ్యాలీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసినా.. విద్యుత్తు, నీటి సమస్యలు వెంటాడేవి. పవర్ హాలిడేలు నరకం చూపించేవి. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు అనుమతుల కోసం పడే తిప్పలకు లెక్కే లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కష్టాలన్నింటికీ చరమగీతం పాడింది. ఎనిమిదిన్నరేండ్లలో ఏకంగా 20 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జీనోమ్ వ్యాలీ.. ప్రపంచ వేదికలపై సగర్వంగా ఎగురుతున్న తెలంగాణ పతాక. లైఫ్ సైన్సెస్ రంగంలో మన అద్భుత విజయాలకు ప్రతీక.. దేశంలో మరే రాష్ట్రమూ తయారు చేయలేని వజ్రపు తునక.. అనేక అంతర్జాతీయ కంపెనీలకు చిరునామా. జీనోమ్ వ్యాలీ ప్రస్థానం ఉమ్మడి రాష్ట్రంలో 1999లో మొదలైంది. నాటి ప్రభుత్వం తుర్కపల్లి, లాల్గడి మలక్పేట్, కొల్తూరు గ్రామ పంచాయతీల పరిధిలో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘పీపీపీ’ పద్ధతిలో దీనిని ప్రారంభించింది. ఏపీఐఐసీ భూములను సేకరించగా.. షాపూర్జీ పల్లోంజి సంస్థ వాటిని అభివృద్ధి చేసింది. ఈ క్లస్టర్ను ప్రారంభించిన సమయంలోనే పూర్తిగా బయోటెక్నాలజీ పరిశోధనలకు, కాలుష్య రహిత ఉత్పత్తులకు కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఆర్ అండ్ డీ యూనిట్లు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి యూనిట్లు ఉండొద్దని కఠిన నిబంధన పెట్టారు.
ఇలా దేశంలో లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్ అండ్ డీ, క్లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు మాత్రమే కలిగి ఉన్న ఏకైక క్లస్టర్ జీనోమ్ వ్యాలీ మాత్రమే. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లు, నాలెడ్జ్ పార్కులు, సెజ్లు, ఇంక్యుబేటర్లు, డ్రై, వెట్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు వేదికగా కొనసాగుతూ.. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నది.
జీనోమ్ వ్యాలీ ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 కలిపి 1,300 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది. చుట్టు కొలత 25 కిలోమీటర్లు. ఫేజ్-1, ఫేజ్-2 కలిపి 700 ఎకరాల్లో ఉండగా, ఫేజ్-3 ఒక్కటే 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా కొనసాగుతున్నది. జీనోమ్ వ్యాలీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి సంస్థ భారత్ బయోటెక్. ఆ తర్వాత ఒకదాని వెనుక ఒక కంపెనీ తరలి వచ్చాయి. ప్రస్తుతం చిన్న, పెద్ద కలిపి 200కుపైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇందులో బయోలాజికల్ ఈ, నోవార్టిస్, డ్యూపాంట్, లాంజ్, లారస్ ల్యాబ్స్, సింజెన్, యూఎస్ ఫార్మకోపియల్, గ్లాండ్ ఫార్మా, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, యూనిక్ బయోటెక్, ఇన్నొపొలిస్, సాంజైన్, నియోవాంటేజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఉన్నాయి. మొత్తం 1,300 ఎకరాల స్థలం కంపెనీలతో నిండిపోయింది. కొత్తగా అనేక కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండగా.. వాటికి కేటాయించేందుకు ప్రభుత్వం స్థలాన్ని అన్వేషిస్తున్నది. ‘100-150 ఎకరాల స్థలం దొరికినా నెల రోజుల్లోనే నిండిపోతున్నది’ అని టీఎస్ఐఐసీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనిని బట్టే డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
‘ఇంతకు ముందు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అన్నట్టుగా.. జీనోమ్ వ్యాలీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసినా.. విద్యుత్తు, నీటి సమస్యలు వెంటాడేవి. పవర్ హాలిడేలు నరకం చూపించేవి. ఇక పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు అనుమతుల కోసం పడే తిప్పలు సరే సరి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కష్టాలన్నింటికీ చరమగీతం పాడింది. గత ఎనిమిదన్నరేండ్లలో ఏకంగా 20 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది.
‘2015 నుంచి ఇప్పటివరకు జీనోమ్ వ్యాలీలో ఎప్పుడూ కరెంటు కోతలు లేవు. 24 గంటలు పవర్ సైప్లె ఉంటుంది. ఏదైనా సాంకేతిక సమస్య వస్తే రెండుమూడు నిమిషాలు మాత్రమే పవర్ పోతుంది. అది కూడా సంవత్సరానికి ఒకటి రెండుసార్లు’ అని ఓ వ్యాపారవేత్త తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీకి రోజుకు సుమారు 50-70 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతున్నది.
జీనోమ్ వ్యాలీ కోసం ప్రత్యేకంగా పైప్లైన్ ఉన్నా.. గతంలో ఎండాకాలం తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. ట్యాంకర్లు వరుస కట్టేవి. ఇప్పుడు రోజుకు సుమారు 10 మిలియన్ లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. అన్ని యూనిట్లకు సరిపడా నీళ్లు అందుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో జీనోమ్వ్యాలీ ‘టీఎస్ఐఐసీ-ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ’ (ఐలా) హోదా కల్పించింది. క్లస్టర్లో పరిశ్రమలకు అనుమతులివ్వడం, అభివృద్ధి, సదుపాయాల కల్పన వంటివాటికి ఏక కేంద్రంగా ఐలా మారింది. కంపెనీలు ఎలాంటి అనుమతులు కావాలన్నా, ఇబ్బందులు ఉన్నా నేరుగా ఐలా కార్యాలయాన్ని సందర్శిస్తే చాలు.
కరోనా విపత్తు వణికిస్తున్న సమయంలో ప్రపంచానికి భరోసా ఇచ్చింది జీనోమ్ వ్యాలీ. ఇక్కడున్న భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ టీకాను అభివృద్ధి చేసి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిపింది. బయోలాజికల్-ఈ సంస్థ రూపొందించిన కార్బేవ్యాక్స్ సైతం ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యింది. కొవిడ్ చికిత్స కోసం ఔషధాలను తయారు చేయడంలో, ప్రస్తుతం ఉన్నవాటిలో ఏవి పనిచేస్తాయో గుర్తించడంలో ఇక్కడి ల్యాబొరేటరీల్లో జరిపిన ‘మాలిక్యూల్ అనాలసిస్’, రిసెర్చ్ కీలక పాత్ర పోషించింది.
ఫార్మా క్లస్టర్ అనగానే ‘కాలుష్య కారక ప్రాంతం’ అనే భావన ఉంటుంది. జీనోమ్ వ్యాలీ అందుకు పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ కేవలం కంపెనీల ఆర్ అండ్ డీ కేంద్రాలు మాత్రమే ఉంటాయి. ఫార్మా రంగానికి చెందిన ‘మాలిక్యూల్స్ అనాలసిస్’.. అంటే రసాయన ముడిపదార్థాల విశ్లేషణ, మానవ శరీరంపై వాటి పనితీరు ఎలా ఉంటుంది? వంటి అంశాలపై పరిశోధనలు మాత్రమే జరుగుతాయి. అవి కూడా అత్యాధునిక ల్యాబొరేటరీల్లో కొనసాగుతాయి. వీటి నుంచి కాలుష్య కారక వ్యర్థా లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదు. ఇక వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి ప్లాంట్లు ఇక్కడే ఉన్నా.. వాటి నుంచి వెలువడే వ్యర్థాలు నామమాత్రం. భవనాలు, ప్రాంగణాలు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయి. ఎక్కడ చూసినా పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. బయటి వాతావరణానికి అక్కడి వాతావరణానికి ఉష్ణోగ్రతల్లో 2-3 డిగ్రీలు వ్యత్యాసం ఉంటుందంటేనే అర్థం చేసుకోవచ్చు.
టీఎస్ ఐపాస్తో జీనోమ్ వ్యాలీలో కొత్త చరిత్ర మొదలైంది. పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులన్నీ ఒకేచోట లభిస్తుండటం, నిర్ణీత గడువులోగా అనుమతులు ఇస్తుండటంతో పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ మొదటి, ఏకైక ఆప్షన్గా మారింది. ‘నేను 12 ఏండ్ల క్రితం చిన్న కంపెనీ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నాను. ఆఫీసుల చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చుకోవడానికి రెండుమూడు నెలలు పట్టింది. టీఎస్ఐపాస్ వచ్చిన తర్వాత కనిష్టంగా రెండు, మూడు వారాల్లోనే అన్నిరకాల అనుమతులు వచ్చేస్తున్నాయి. మా కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొన్న వెంటనే అధికారులు వచ్చి పరిశీలించి గడువులోగా అనుమతులు మంజూరు చేశారు’ అని ఓ కంపెనీ అధిపతి పేర్కొన్నారు.