కామారెడ్డి, మార్చి 18: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలువడంతోపాటు ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా చేపట్టిన ‘ఉన్నతి’ కార్యక్రమంలో యవతకు శనివారం నుంచి నైపుణ్య శిక్షణలు ప్రారంభంకానున్నాయి. 2018-19లో 100 రోజులు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కుటుంబాల్లోని విద్యావంతులైన యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి చూపేందు కు ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో శనివారం నుంచి డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక బ్యాచ్ను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసినవారికి కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, బేసిక్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ సిల్క్స్, బాడీ లాంగ్వేజ్, ఇంట ర్వ్యూ స్కిల్స్, మేస్త్రీ, వెల్డింగ్ తదితర అంశాల్లో 7,799 మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తారు. 15 నుంచి 100 రోజుల వరకు కొనసాగే ఈ కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. శిక్షణా కాలంలో భోజన, వసతితోపాటు రోజుకు రూ.237 చొప్పున ఉపకార వేతనం అందజేయనున్నారు.
ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.. యువతకు ఉపాధి కల్పించడమే ‘ఉన్నతి’ లక్ష్యం. 100 రోజులపాటు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న పేద కుటుంబాల్లోని యువతను ఈ పథకానికి ఎంపికచేసి 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
– వెంకటమాధవరావు, డీఆర్డీవో, కామారెడ్డి జిల్లా