కలెక్టరేట్, అక్టోబర్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్రావు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణామూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కు దరఖాస్తు చేసుకున్నది.
దరఖాస్తును ఆమెకు అనుకూలంగా పంపడానికి ఉపేందర్రావు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న రూ.17 వేలు తీసుకోగా.. మిగతా రూ.13 వేలు భూక్యా శివకుమార్ (సరితకు సంబంధించిన బంధువు) వద్ద పట్టణంలోని జడ్పీ హైస్కూల్ గీతానగర్లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉపేందర్రావుపై కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.